రంగారెడ్డి, జూన్ 25, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నది. మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారు. ఐదేండ్లుగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు సక్సెస్ కావడం, సరిపడా నీరు ఉంటుండడంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే నాలుగు దశలు చేపల పెంపకం పూర్తి కాగా, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ ఏడాది టార్గెట్ కోటి 40 లక్షలు….
జిల్లాలో గతేడాది జిల్లాలో కోటి 30 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదలగా, జిల్లా మత్స్యశాఖ అధికారులు ఈ ఏడాది 1.40 కోట్ల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న, పెద్ద పరిమాణంగల చేప పిల్లలను జిల్లాలోని చెరువుల్లో పెంచేందుకు నిర్ణయించారు. పెద్ద చేప పిల్లలు (82-100 మి.మీటర్లు), చిన్న చేపపిల్లలు(35-40 మి.మీటర్లు) రెండు రకాల చేపలను పెంచనున్నారు. అయితే చేప పిల్లల విత్తనాలను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లతో జిల్లాకు చేప పిల్లల విత్తనాలను సమకూర్చనున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ఆన్లైన్లో విత్తనాలకై టెండర్లను ఆహ్వానించేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 576 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతున్నది. సంబంధిత చెరువుల్లో 119 చెరువులు మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉండగా, మిగతా 417 చెరువులు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చిన వెంటనే చేప పిల్లలను వదలనున్నారు.
వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేప పిల్లలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. గతంలో కొన్ని చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. చెరువుల్లో నీరు లేక కొందరు మత్స్యకారులు వలసలు పోగా, మరికొందరు ఇతర పనులు చేస్తుండేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు పూర్తైన చెరువుల్లో చేప పిల్లలను పెంచే ప్రక్రియ జరుగుతుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపలను పెంచుతున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జరుగుతున్నది.
అక్రమాలకు తావులేకుండా గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించింది. జిల్లాలో 103 మత్స్యకారుల సొసైటీలుండగా, వీటిలో 12 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 6,616 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేయడంతోపాటు చేపలను విక్రయించడంలో నష్టపోకుండా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా దళారుల ప్రమేయం ఎక్కువగా ఉండి నిజమైన మత్స్యకారులు నష్టపోవాల్సిన పరిస్థితి లేకుండా ప్రణాళికను రూపొందించింది. చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తో పాటు స్థానికంగా విక్రయించేందుకుగాను అధికారులు చర్యలు చేపట్టారు. 70 శాతం సబ్సిడీతో వాహనాలను ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసింది. చేపలను భద్రపర్చేందుకుగాను ఐస్ బాక్సులతోపాటు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వచ్చే నెలాఖరులోగా టెండర్లు పూర్తి ..
ఈ ఏడాది చేపల పెంపకానికి ప్రతిపాదనలను సిద్ధం చేశాం. చేప పిల్లల కొనుగోలుకుగాను వచ్చేనెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతాం. చెరువులు నిండిన వెంటనే చేప పిల్లలను వదులుతాం. జిల్లాలో ఈ ఏడాది కోటి40 లక్షల చేప పిల్లలను 576 చెరువుల్లో పెంచనున్నాం. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన మత్స్యకారులకే చేపపిల్లలను పంపిణీ చేస్తాం. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందజేస్తున్న చేప పిల్లలతో మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. అదేవిధంగా చేపలను విక్రయించడంలోనూ దళారుల ప్రమేయం లేకుండా కేవలం మత్స్యకారులకే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.