రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం
అందుబాటులోకి ద్వి, త్రిచక్రవాహనాలు
పర్యావరణానికి రక్షణ, అధిక ఆదాయానికి మార్గం
వీటికి నో రిజిస్ట్రేషన్, నో డ్రైవింగ్ లైసెన్స్
ములుగు, మార్చి 29 (నమస్తే తెలంగాణ): పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వాహనాల ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం నష్టాలను చవిచూస్తున్నారు. అందుకే కొందరు పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యావరణ హితమైన వాహనాలను అందించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా భారీ రాయితీలను అందిస్తున్నది.
ములుగు జిల్లాకేంద్రానికి చెందిన కృష్ణకు వాటర్ ప్లాంట్ ఉంది. ప్రతి రోజూ ఆటోలో నీళ్లు తీసుకెళ్లి, ఇంటింటికీ తిరిగి పోసేవాడు. ప్రస్తుతం వేసవికాలం మొదలుకావడంతో నీటి వినియోగం పెరిగి, అధిక ట్రిప్పులు తిరగాల్సి వస్తున్నది.
కానీ, పెరుగుతున్న డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరిగి వాటర్ ప్లాంట్ నిర్వహణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణ వినూత్నంగా ఆలోచించి బ్యాటరీ ఆటోను రూ.లక్షా80వేలు పెట్టి కొనుగోలు చేశాడు. 6 నుంచి 7గంటల పాటు చార్జింగ్ చేస్తే సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఈ వాహనం ప్రయాణిస్తుంది. దీంతో అతడికి రవాణా ఖర్చులు తగ్గాయి. కంపెనీ బ్యాటరీలకు సంవత్సరం వారంటీ సైతం ఇచ్చింది. ద్విచక్రవాహనాలు కూడా రూ.40వేల నుంచి 90వేల వరకు వివిధ మోడళ్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన పనిలేదు. రెండు సంవత్సరాల తర్వాత బ్యాటరీలను మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి రూ.40వేలు ఖర్చవుతుంది.