బెంగళూరు : రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్(KRTA) ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా ఇవాళ బెంగళూరులో దేవేగౌడను కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై దేవేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని దేవేగౌడ పేర్కొన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్కు తమ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు తాను కూడా హాజరై మద్దతు ప్రకటించానని దేవేగౌడ గుర్తు చేశారు. ఇది తన రాజకీయ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పును తీసుకొస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ శక్తిమంతంగా మారుతుందని దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాల బలోపేతానికి కృషి చేస్తున్న సందీప్ కుమార్ మక్తాలాపై దేవేగౌడ ప్రశంసలు కురిపించారు.