న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు (Dense Fog) ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. డిసెంబర్ 31 తర్వాత పొగ మంచు క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని (North India) చాలా రాష్ట్రాల్లో చలి వాతావరణం కొనసాగుతున్నది. చలిగాలుల ప్రభావం వల్ల వచ్చే జనవరి 4 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల పాటు ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రవాణా రంగంపై పొగమంచు తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. విమానాలు, రైళ్లను అధికారులు పెద్ద సంఖ్యలో రద్దుచేస్తున్నారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు, రైల్వేలు, వాహనాల చోదకులు ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణశాఖ సూచించింది. తీవ్ర మైన చలి ప్రభావం వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పాఠశాలలకు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.