తిరువనంతపురం: తండ్రితో కలిసి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన కుమారుడు తల్లిని హత్య చేశాడు. దీంతో కుమారుడితోపాటు తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ సంఘటన (Kerala shocker) జరిగింది. భరణిక్కవు సమీపంలోని కురతికాడ్ ప్రాంతానికి చెందిన రామ్ మోహన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి చిన్న కుమారుడు 30 ఏళ్ల మిథున్ మోహన్తో కలిసి మద్యం సేవించాడు. మద్యం సీసాలు ఖాళీ కావడంతో మరిన్ని తెచ్చుకోవాలని భావించారు. దీంతో కుమారుడు మిథున్, 65 ఏళ్ల తల్లి రమను డబ్బులు అడిగాడు. అయితే మద్యం తాగడం కోసం డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు మిథున్, గొంతు నొక్కి తల్లిని హత్య చేశాడు. అనంతరం తండ్రితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కాగా, బుధవారం మధ్యాహ్నం పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు. నేలపై విగతజీవిగా పడి ఉన్న తల్లిని చూసి షాక్ అయ్యాడు. తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన అతడు, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వృద్ధురాలైన రమ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమారుడు మిథున్ మోహన్ గురించి స్థానికంగా ఆరా తీశారు.
మరోవైపు మద్యం, డ్రగ్స్కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. తల్లి హత్యలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి రామ్ మోహన్ ఎక్కడ ఉన్నాడో అన్నది చిన్న కుమారుడి ద్వారా తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి ఆ వృద్ధుడ్ని కూడా అరెస్ట్ చేశారు.