న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం కమ్మేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి కంటే ఇక్కడ వందరెట్లు అధిక కాలుష్యం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో బడులకు ఈ నెల 10 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఢిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల కమర్షియల్ వాహనాల ప్రవేశంపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపైనా నిషేధం విధించింది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ర్టాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని సూచించింది.