Delhi | న్యూఢిల్లీ, మే 29: ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదయ్యింది. నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.14 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదే ప్రాంతంలో మంగళవారం 49.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బుధవారం మరింత పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీతో పాటు మొత్తం దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇంతకుముందు ఢిల్లీలో 2002లో అత్యధికంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాజస్థాన్ నుంచి వస్తున్న వడగాడ్పుల వల్ల ఢిల్లీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఎండ వేడి తీవ్రంగా ఉండటంతో ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఎండవేడికి తాళలేక ఢిల్లీ ప్రజలు ఇండ్లు, కార్యాలయాల్లో ఏసీల వినియోగం భారీగా పెంచేశారు. దీంతో ఢిల్లీలో బుధవారం విద్యుత్తు డిమాండ్ 8,302 మెగావాట్లకు చేరుకుంది.
ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా కీలక ఆదేశాలు ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేతనంతో కూడిన విరామం ఇవ్వాలని ఆదేశించారు.
ఢిల్లీలోని మంగేశ్పూర్ ప్రాంతంలో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో సంబంధిత డాటా కచ్చితత్వంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఉష్ణోగ్రత డాటాను పరిశీలిస్తున్నామని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం సాయంత్రం వెల్లడించింది. సెన్సార్ లేదా లోకల్ ఫ్యాక్టర్స్లో ఎర్రర్ కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. డాటాను, సెన్సార్లను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీలో అంత స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చని, దీన్ని వెరిఫై చేయాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐఎండీ అధికారులకు సూచించారు.
ఢిల్లీలోని మంగేశ్పూర్లో బుధవారం నమోదైన 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత గత రికార్డులను చెరిపేసింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే తొలిసారి. 2016 మే నెలలో రాజస్థాన్లో ఫలోడీలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఇప్పటివరకు భారత్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 1956లోనూ రాజస్థాన్లోని అల్వార్లో 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
ఎండల తీవ్రతతో ఢిల్లీలో నీటి కొరత మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇండ్లకు సరఫరా చేసే నీటితో వాహనాలు కడిగినా, నిర్మాణాలను ఉపయోగించినా, ఇతర పద్ధతుల్లో వృథా చేసినా రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు అధికారులు ప్రకటించారు. నీటి వృథాను అరికట్టేందుకు గానూ 200 బృందాలను నియమించాలని ఢిల్లీ జల్ బోర్డును మంత్రి ఆతిశీ ఆదేశించారు.