న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించగా కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోడియా తన భార్యను కలుసుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది.
అయితే, జైలు నుంచి బయటికి వెళ్లిన తర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడకూడదని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ను వినియోగించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం సిసోడియా తన భార్యను కలిసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు కూడా అతని వెంటే ఉండనున్నారు. కాగా, మనీశ్ సిసోడియా సతీమణి సీమా సిసోడియా గత కొన్నాళ్లుగా మల్టిపుల్ స్క్లీరోసిస్ (నరాలు గట్టిపడే వ్యాధి) వ్యాధితో బాధపడుతున్నారు.
ఇదిలావుంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాను ఈ ఏడాది మార్చిలో సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టు అనుమతితో తీహార్ జైలుకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఇదే కేసులో ఈడీ కూడా సిసోడియాను అదుపులోకి తీసుకుని కోర్టు అనుమతితో దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతం సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.