న్యూఢిల్లీ: ‘కౌ హగ్ డే’ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఒక వ్యక్తి సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పరిశీలించిన కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అది విధానపరమైన నిర్ణయమని, తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) ఫిబ్రవరి 6న ఒక ఉత్తర్వు జారీ చేసింది. భావోద్వేగంతో కూడిన ఈ చర్య వ్యక్తుల్లో ఆనందాన్ని పెంచుతుందని పేర్కొంది. అయితే గోమాతను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలా? అని పలువురు ప్రశ్నించారు. హత్తుకునే సమయంలో ఆవు వల్ల జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కొందరు ప్రశ్నించారు. ఈ విమర్శల నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ఫిబ్రవరి 10న ‘కౌ హగ్ డే’ ఉత్తర్వును ఉపసంహరించుకుంది.
కాగా, ‘కౌ హగ్ డే’ ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, ఓ ఆధ్యాత్మిక సంస్థ ఛైర్మన్ అయిన కొలిశెట్టి శివకుమార్ సవాల్ చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆమోదం, ఆదేశాల మేరకు ‘కౌ హగ్ డే’ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు గుర్తు చేశారు. అయితే సరైన కారణం పేర్కొనకుండా జంతు బోర్డు దానిని ఉపసంహరించుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘కౌ హగ్ డే’ని అమలు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
మరోవైపు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈ పిటిషన్ను పరిశీలించారు. ‘మీరు ఫలానా రోజున ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని కోర్టు ఎలా చెబుతుంది?’ అని ప్రశ్నించారు. జంతు బోర్డు ఉత్తర్వులు ప్రభుత్వ ఆదేశాల పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఆర్టికల్ 226 ప్రకారం ఈ పిటిషన్లో కోర్టు జోక్యం చేసుకోదని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఈ పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.