న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్టులు చేయటంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘మీరు నన్ను జైల్లో బంధించి ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ, నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిష్ పాలకులు కూడా స్వాతంత్య్ర సమరయోధులను బంధించి, ఇబ్బందులు పెట్టారు. కానీ, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు’ అని హిందీలో ట్వీట్ చేశారు.
అనిల్ పరబ్ సన్నిహితుడికి ఈడీ కస్టడీ
శివసేన(ఉద్దవ్ ఠాక్రే వర్గం) నేత అనిల్ పరబ్ సన్నిహితుడు సదానంద్ కదంను స్థానిక ప్రత్యేక కోర్టు ఈనెల 15 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. రత్నగిరి జిల్లాలోని ఓ రిసార్ట్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సదానంద్ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. అనిల్ పరబ్పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఈ ఏడాది జనవరిలో రత్నగిరి జిల్లా దపోలిలోని బీచ్ రిసార్ట్ను అటాచ్ చేశారు. ఈ రిసార్ట్తో తనకు సంబంధం లేదని అనిల్ పరబ్ ఇదివరకే ఖండించారు.