న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్పై మాత్రం అభియోగాలు మోపాలని కోర్టు ఆదేశించింది. 2018లో అప్పటి చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్పై వీళ్లు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కోర్టు తమకు క్లీన్చిట్ ఇవ్వడంపై మనీష్ సిసోడియా స్పందించారు. న్యాయానికి, నిజానికి విజయం దక్కిన రోజు ఇది.
ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిరాధారమని కోర్టు చెప్పింది. ఓ తప్పుడు కేసులో ముఖ్యమంత్రి ఇవాళ నిర్దోషిగా తేలారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని మేము చెబుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రిపై జరిగిన కుట్ర ఇది అని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్, సిసోడియాతోపాటు మరో 9 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు నేరపూరిత కుట్ర కేసులను నమోదు చేశారు. 2018, ఫిబ్రవరి 19న కేజ్రీవాల్ అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో తనపై దాడి జరిగినట్లు అప్పటి సీఎస్ అన్షు ప్రకాశ్ ఆరోపించడం సంచలనం సృష్టించింది.