Arvind Kejriwal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఏడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించింది. విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఈ నెల 28 వరకూ కస్టడీకి అనుమతించింది. అంతకుముందు కోర్టులో వాదనలు వాడీవేడీగా సాగాయి. మద్యం పాలసీ కేసులో ప్రధాన కుట్రదారు కేజ్రీవాలేనని ఈడీ ఆరోపించింది. పాలసీ రూపకల్పన, అమలు కోసం ఆయన కోట్లాది రూపాయల నిధులను తీసుకొన్నట్టు పేర్కొంది.
ఈ డబ్బును పంజాబ్, గోవా ఎన్నికల కోసం వినియోగించినట్టు తెలిపింది. ‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాలే కింగ్పిన్. సౌత్గ్రూప్నకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని ఈడీ ఆరోపించింది. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని కేజ్రీ న్యాయవాదుల బృందం ఈడీ వైఖరిని తప్పుబట్టింది. ఈ కేసులో న్యాయమూర్తి, న్యాయస్థానం, శిక్ష అమలు వంటి మూడు పాత్రలను ఈడీనే పోషిస్తున్నదని మండిపడింది. మరోవైపు, తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో గురువారం రాత్రి దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం ఉపసంహరించుకొన్నారు. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్ ఉన్నందుకే పిటిషన్ను వెనక్కి తీసుకొన్నట్టు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు తెలిపారు.
తన అరెస్టుపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ‘ఈ దేశానికి సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేశా. జైల్లో ఉన్నా.. బయట ఉన్నా అది కొనసాగిస్తా’ అన్నారు. మరోవైపు, అరెస్టయిన కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కేజ్రీవాల్ నివాసంలో గురువారం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈడీ అధికారులకు 150 పేజీల డాక్యుమెంట్లు దొరికాయని, అందులో దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ ర్యాంకుకు చెందిన ఇద్దరు అధికారుల కీలక సమాచారం ఉన్నదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఇద్దరిలో ఒకరు గురువారం జరిగిన సోదాల్లో పాల్గొన్నారని తెలిపింది. ఈడీ అధికారుల వివరాలను కేజ్రీవాల్ సేకరించడం వెనుక ఉన్న కారణాలను శోధిస్తున్నట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.