న్యూఢిల్లీ : ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ రూ 6300 కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు.
ఇంత మొత్తం ఖర్చు చేయనిపక్షంలో గోధుమలు, బియ్యం, మజ్జిగ వంటి వాటిపై జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని కేజ్రీవాల్ కేంద్రం తీరును తప్పుపట్టారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడేవారు కాదని ఆయన ట్వీట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీని ఇతర పార్టీల సర్కార్లను కూల్చే సీరియల్ కిల్లర్గా అభివర్ణించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఇప్పటివరకూ గోవా, కర్నాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ సర్కార్లను కూలగొట్టిందని అన్నారు. ప్రజలు ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాషాయ నేతలు వాటిని కూలదోస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ను పడగొట్టేందుకు ఒక్కో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ 20 కోట్లు ఆఫర్ చేస్తోందని అంతకుముందు కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.