న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాను అనుకున్నది సాధించడానికి ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకుంటున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. శనివారం ఆయన ట్వీట్ చేస్తూ ‘న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియంతో, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలతో, పంటలకు మద్దతు ధర విషయంలో రైతులతో, పన్నుల పేరుతో వ్యాపారులతో.. ఇలా ప్రతి ఒక్కరితోనూ కేంద్రం గొడవ పెట్టుకుంటున్నది. ఎవరి పని వారిని చేసుకోనివ్వడం మంచిది. అంతేగానీ ప్రతీ విషయంలోనూ వేలు పెట్టడం సరైన పద్ధతి కాదు’ అని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను చేజిక్కించుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యం కుట్రలు చేస్తున్నదని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ఓ వైపు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నదని, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో సోదాలు చేయిస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు తావులేదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.