Punjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆప్ ఆ దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. చండీఘఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటీవల తమ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం నగరంలో జరిగిన విక్టరీ మార్చ్లో పాల్గొన్నారు.
చండీఘఢ్ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని, ఎలాంటి తప్పిదాలకు పాల్పడబోమని, పార్టీ వెన్నంటి ఉంటామని నూతనంగా ఎన్నికైన 14 మంది పార్టీ కౌన్సిలర్లతో కేజ్రీవాల్ ప్రమాణం చేయించారు. చండీఘఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. 35 వార్డులకు గాను ఆప్ 14 వార్డులను గెలుచుకోగా, బీజేపీ 12 వార్డుల్లో గెలుపొందింది.
కాంగ్రెస్ 8 వార్డుల్లో, ఎస్ఏడీ ఒక వార్డులో గెలుపొందాయి. ఆప్ విజయ్ ర్యాలీలో కేజ్రీవాల్తో పాటు పార్టీ పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్, పంజాబ్ పార్టీ సహ ఇన్చార్జ్ రాఘవ్ చద్దా, ప్రదీప్ చాబ్ర పాల్గొన్నారు. చండీఘఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయం అందించిన నగర ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
తమ పార్టీ పట్ల ప్రజలు చూపిన విశ్వాసాన్ని వమ్ము చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్లను తిరస్కరించిన ప్రజలు తాజాగా చండీఘఢ్లోనూ తెలివైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అందివచ్చిన విజయంతో ఇదే ఊపులో త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది.