అధికార దర్పం లేదు.. హంగూ ఆర్భాటం ఉండదు.. ఈ దేశంలో సామాన్యుడికి అతడో ప్రతీక.. నిజమైన దేశభక్తికి, విద్వేషం లేని హైందవానికి, విలువలకు కట్టుబడిన రాజకీయానికి, నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపం. ఆయన ఆమ్ఆద్మీ!.. ఆయన అరవింద్ కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్టు చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇది ధిక్కరణకు పడిన సంకెళ్లు! ఢిల్లీ పాదుషాల పాదాల ముందు మోకరిల్లనందుకు ఫలితం!
రాజకీయ మాలిన్యాన్ని ఊడ్చిపారేసేందుకు చీపురుపట్టినవాడు ఇంకు చల్లిననాడు భయపడలేదు కాబట్టే.. మరో మరక! ఆ పై ఇంకొకటి! మనవాడు కాకపోతే, మనతో రాకపోతే.. మసిపూసేయడమే!
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్ల 7 నెలల 7 రోజులు..! ప్రజాస్వామ్య పండుగ అయిన సార్వత్రిక ఎన్నికలముందు నిలిచిన భారతదేశంలో నియంతృత్వం జడలు విప్పుతున్నది. సాక్షాత్తూ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం రాజకీయ వికృత క్రీడ! కోర్టుల్లో కేసు నడుస్తుండగానే.. అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఇవ్వకుండానే.. ఎదిరించినవాళ్ల గొంతును దర్యాప్తు పేరుతో దౌర్జన్యంగా నొక్కడమే నయా రాజకీయం.
ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ అరెస్టు జరిగినా చెప్పే కారణం ఒక్కటే.. ‘ఢిల్లీ మద్యం పాలసీ కేసు’! ఒకే తాడును దేశంలో వేర్వేరు రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల మెడకు చుడుతున్నదీ కేసు! ఎదిరించినవారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది అధికారగర్వం. ఎదురునిలిచిన పార్టీలన్నింటినీ ఒకే మద్యం సీసాలో కుక్కేసి బిరడా బిగించాలన్నదే దాని కుతంత్రం!
మొన్న మనీశ్ సిసోడియా.. నిన్న కవిత.. నేడు కేజ్రీవాల్! ఒకే దేశం.. ఒకే ఆరోపణ.. ఒకటే ఫార్మాట్! సందెవేళ సెర్చ్వారంట్తో వాలిపోయే దర్యాప్తు బృందం.. చీకటిపడ్డాక అరెస్టు వారంట్తో పట్టుకెళ్తుంది. కేసుల్ని అల్లేసి, బురదజల్లేసి.. జనబాహుళ్యం ముందు బదనాం చేసేశామనే క్రూర వికటాట్టహాసం ఆ తర్వాత రోడ్షోలో ప్రతిధ్వనిస్తుంది.
Arvind Kejriwal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అరెస్టును ఆప్ నేతలు ఖండించారు. అరెస్టుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి సీఎం ఇంటిముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్కు గురువారం ఈడీ తొమ్మిదోసారి సమన్లు జా రీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ర క్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం ఉదయం విచారించిన హైకో ర్టు.. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను చూపించాలని ఈడీని ఆదేశించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొ న్ని పత్రాలు ఉన్న సీల్డ్ కవర్ను ఈడీ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. దీం తో ఈ కేసులో అరెస్ట్ నుంచి కేజ్రీవాల్కు రక్ష ణ కల్పించలేమంటూ ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్తో సహా ఆయన కుటుంబసభ్యుల ఫోన్లలోని డాటాను ల్యాప్టాప్లోకి బదిలీ చేసి వాటిని సీజ్ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారన్న వార్తలు వ్యాపించా యి. దీంతో కేజ్రీవాల్ న్యాయవాదుల బృం దం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ అం శాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరుపాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. ఇంతలోనే ఈడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొన్నారు. కేజ్రీవాల్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టనున్నట్టు ఈడీ అధికారి తెలిపారు. విచారణ కోసం కస్టడీ కోరనున్నట్టు పేర్కొన్నారు.
కేజ్రీవాల్ నివాసానికి చేరుకొన్న ఈడీ అధికారులను ఆయన సన్నిహితులు, సిబ్బంది అడ్డుకొన్నారు. దీంతో పదోసారి సమన్లు ఇ చ్చేందుకు వచ్చామని ఈడీ అధికారులు ఇం ట్లోకి ప్రవేశించినట్టు విశ్వసనీయవర్గాలు తె లిపాయి. ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు సోదాలు మొదలు పెట్టారు. ఇదేంటని ప్ర శ్నించినవారికి సెర్చ్ వారెంట్ చూపించారు. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్కు అధికారులు సూచించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఇంట్లోనే విచారించాలని కోరారు. కా సేపటి తర్వాత కేజ్రీవాల్ను అరెస్టు చేశారు.
సీఎం పదవిలో ఉంటూ అరస్టైన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. గ తంలో బిహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బా ధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టైన హేమంత్ సోరెన్ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పు డే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టప్రకారం శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు. కేజ్రీవాల్పై ఆరోపణలు రుజువు కాలేదు. శిక్ష పడలేదు. కాబట్టి, సీఎంగా కొనసాగేందుకు చట్టప్రకారం అడ్డంకులుండవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే కేజ్రీవాల్ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం పాలసీ కేసులో మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆ బృందం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరుపాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది. అయితే, కేజ్రీవాల్ బృందం పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారించే అవకాశమున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశంలేకుండా రాత్రిపూట ఉద్దేశపూర్వకంగానే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆప్ నేతలు విమర్శించారు.
మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్కు ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసింది. అయితే, ఈడీ విచారణకు ఆయన గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అధికారులు తొమ్మిదోసారి కేజ్రీవాల్కు సమన్లు పంపించారు. ఈ నేపథ్యంలో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి కేజ్రీవాల్కు రక్షణ కల్పిస్తూ ఆదేశాలివ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తా ము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణను ఏప్రిల్ 22కు వా యిదా వేసింది. దీంతో డజను మందితో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకొన్నది. అడ్డుకొన్న కేజ్రీవాల్ సన్నిహితులకు ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ చూపించారు. సుమారు రెండు గంటలపాటు కేజ్రీవాల్ను ప్రశ్నించిన అధికారులు ఆయన స్టేట్మెంట్లను సెక్షన్ 50 మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రికార్డు చేశారు. అనంతరం ఆయన్ని అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో సీఎం నివాసానికి ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇంటివద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), నాలుగు కంపెనీలకు చెందిన సీఆర్పీఎఫ్ ఫోర్స్, 100 మందికి పైగా పోలీసులతో భారీగా మోహరించారు. అటు ఈడీ కార్యలయం వద్ద కూడా భద్రతా దళాలను భారీగా మోహరించారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా ? కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రస్తుతం కీలక నాయకురాలిగా ఉన్న ఆతిశీ స్పష్టత ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కొనసాగుతారని, ఇందులో రెండో ఆలోచనే లేదని ఆమె ప్రకటించారు. కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే.. జైలు నుంచే ఆయన పని చేస్తారని ముందు నుంచే తాము స్పష్టంగా చెప్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్పై నేరం రుజువు కాలేదని, జైలు నుంచి పని చేయకుండా అడ్డుకునే చట్టమేదీ లేదని ఆమె చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయెల్, ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా కూడా.. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తారని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు.
మద్యం పాలసీ కేసులో వారం క్రితం జరిగిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత అరెస్టు విధానం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు విధానం ఒకేతీరుగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్లో రోజంతా హైడ్రామా నడిచింది. తొలుత ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సోషల్మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది. అనంతరం ఈడీ రంగప్రవేశం చేసినట్టు వార్తలు వచ్చాయి. కో ర్టు సమయం ముగిసేదాకా ఈడీ అధికారులు తనిఖీల పేరిట కాలయాపన చేశారు. ఎవరినీ రానీయకుండా కవిత ఇంటిని దిగ్బంధించారు. ఫోన్లను సీజ్ చేశారు. బలగాలను మోహరించారు. అనంతరం అరెస్టు వారెంట్ జారీ చేసి కవితను అదుపులోకి తీసుకొన్నారు. ఆమె పేరుపై ముందే విమానం టికెట్ బుకింగ్ చేసి అదే రాత్రి ఢిల్లీకి తరలించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దా రులన్నింటినీ మూసేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలోనూ సరిగ్గా ఈడీ అధికారులు అదే ప్లాన్ అమలు చేశా రు. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమ ని ఢిల్లీ హైకోర్టు చెప్పగానే.. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. కోర్టు సమయం ముగిసేంతవరకూ తనిఖీల పేరిట కాలయాపన చేశారు.
2021లో తీసుకొచ్చిన ఢిల్లీ నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను పలుమార్లు విచారించిన సీ బీఐ.. 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ 390 రోజులపాటు ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. ఇదే కేసులో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్సింగ్ ను కూడా గత అక్టోబర్లో ఈడీ కస్టడీలోకి తీసుకొన్నది. గత శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశా రు. ఇక ఇదే కేసు విషయమై గత ఏడా ది నవంబర్ 2న తొలిసారి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. 2023 డి సెంబర్ 21న రెండోసారి, ఈ ఏడాది జనవరి 3న మూడోసారి, అదేనెల 18 న నాలుగోసారి, ఫిబ్రవరి 2న ఐదోసా రి, అదే నెల 19, 26న వరుసగా ఆరోసారి, ఏడోసారి, మార్చి 4న ఎనిమిదోసారి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇచ్చిం ది. చివరగా గురువారం తొమ్మిదోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు.
దశాబ్ద కాలంగా తమ పాలనా వైఫల్యాలు, ఓటములను కప్పిపుచ్చుకోవడానికే ఫాసిస్ట్ బీజేపీ.. కేజ్రీవాల్, సోదరుడు హేమంత్ సోరెన్లను అరెస్ట్ చేసింది. ఈ శతాబ్ద కాలంలో కనీసం ఒక్క బీజేపీ నేత మీద అయినా దర్యాప్తు కానీ, అరెస్ట్ కానీ జరిగిందా? కేవలం విపక్షాలపై కక్షకట్టి వారిని వేటాడుతున్నారు. వారి చర్యల ద్వారా ఇప్పుడు నిజస్వరూపం బయటపడింది. వారి ఈ వేధింపులు ఇండియా కూటమి విజయాన్ని ఆపలేవు.
– తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రశ్నించే గళాలను అణచివేసేందుకే ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఇది తీవ్ర అభ్యంతరకరం. ప్రజాస్వామ్య ప్రక్రియకు భయపడే వారి పిరికితనాన్ని నిరూపిస్తున్నది.
-కేరళ సీఎం పినరయి విజయన్
బీజేపీ చేతిలో ఈడీ, సీబీఐలు ప్రధాన అస్ర్తాలుగా ఉన్నాయి. వాటి ద్వారా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రత్యర్థులను అణచివేయడం, రాజకీయ ప్రతీకారానికి దిగడం ఆ పార్టీ ఏకైక లక్ష్యం.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజా విప్లవానికి జన్మనిస్తుంది. ఎవరైతో ఓటమి భయంతో బందీలవుతారో వారు ఇతరులను జైలుకు పంపడానికి ప్రయత్నిస్తారు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రామని బీజేపీకి తెలుసు. ఆ భయంతోనే విపక్ష నేతలను ఎన్నికల నాటికి ప్రజల మధ్య లేకుండా చేయాలనుకుంటున్నది.
– ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్