Delhi CM | 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ (BJP) అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో గెలిచింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు కూడా మొదలు పెట్టింది.
అయితే, సీఎం అభ్యర్థి (Delhi CM) ఎవరన్నదానిపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ హైకమాండ్ ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో తొమ్మిది మందిని షార్ట్ లిస్ట్ చేసి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
మోదీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. మోదీతో చర్చలు జరిపి ఓ అంచనాకు రానున్నట్లు తెలిసింది. ఇక ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19, 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించనప్పటికీ, ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు.
పర్వేశ్ వర్మ: ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై వర్మ గెలుపొందడం విశేషం. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం.
రమేశ్ బిధూరి: ఈయన మాజీ ఎంపీ. గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. ఢిల్లీ సీఎం ఆతిశీపై పోటీ చేశారు. రమేశ్ ఢిల్లీ బీజేపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.
బన్సూరి స్వరాజ్: విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. న్యూఢిల్లీ నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ బీజేపీలో గుర్తింపు పొందారు.
స్మృతి ఇరానీ: ఒకప్పటి బీజేపీ ముఖ్య లీడర్లలో స్మృతి ఇరానీ ఒకరు. కానీ, గత లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆమె తెరమరుగయ్యారు. ఇప్పుడు సీఎం రేసులో ఆమె కూడా ఉన్నట్టు సమాచారం.
Also Read..
Elephants | ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
Mumbai terror attacks | ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Pulwama Attack | పుల్వామా దాడికి ఆరేండ్లు.. వీర జవాన్లకు నివాళులు..!