న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కి కట్టబెడుతూ మోదీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆదివారం ఆప్ భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘12 ఏండ్ల క్రితం ఇక్కడి నుంచే (రామ్లీలా మైదానం) అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాం.
దేశం నుంచి నియంతను తరిమేసేందుకు మళ్లీ ఇక్కడికి వచ్చాం. ఇది నియంతృత్వాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపితం చేసే ఉద్యమం. ప్రజాస్వామ్యం, ప్రజల నిర్ణయమే సుప్రీం అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఏ పార్టీ అయినా సరే ఎన్నికైన ప్రభుత్వానికే పనిచేసే హక్కు ఉంటుంది. ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా.. సుప్రీంకోర్టు తీర్పు తప్పా? ఆ తీర్పునకు ప్రధాని కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? సుప్రీం తీర్పును లెక్కచేయబోనని ఆర్డినెన్స్ ద్వారా ప్రధాని చెప్తున్నారు. ప్రజలు సుప్రీం కాదు.. ఎల్జీయే సుప్రీం అని దాని అర్థం’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇప్పుడు ఢిల్లీపై దాడి చేసిన బీజేపీ.. త్వరలో దేశం మొత్తం ఇదే విధానాన్ని అనుసరిస్తుందని హెచ్చరించారు.
మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ ఓ పిట్ట కథ చెప్పారు. ‘పేద ఇంట్లో పుట్టిన ఓ యువకుడు పండితులు జోస్యం చెప్పినట్టుగా రాజవుతాడు. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసేలా నోట్ల రద్దు చేస్తాడు. రూ.2 వేల నోటును రద్దుచేయాలని ఎవరో చెప్పగానే చేసేస్తాడు. కొన్నేండ్ల తర్వాత మొత్తం కరెన్సీ నోట్లనే రద్దుచేయాలని కొందరు కోరగానే రద్దు చేసేస్తాడు. ఎవరు ఏ పేపర్ తెచ్చి సంతకం చేయాలని కోరినా పెట్టేస్తాడు. చివరకు అతడికి చదువు రాదని ప్రజలకు తెలుస్తుంది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిచి మోదీ ప్రధాని అయితే.. ఆయన దేశంలో అతిపెద్ద నియంత అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆందోళన వ్యక్తంచేశారు. మోదీకి వ్యతిరేకంగా దేశమంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.
కవాడిగూడ, జూన్ 11: ఢిల్లీలో అధికారుల పోస్టింగులపై పెత్తనం కోసం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.