Maharashtra | ముంబై, అక్టోబర్ 4: బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజుల్లో వివిధ జిల్లాల్లో మొత్తం 78 మంది చనిపోగా, ఇందులో 30 వరకు నవజాత శిశు మరణాలున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే సర్కార్పై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ చతికిలపడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నాందేడ్ దవాఖానల్లో 31 మంది, థాణేలో 18మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నాగపూర్లో 24 గంటల వ్యవధిలో (బుధవారం ఉదయం 8 గంటల నాటికి) ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దవాఖాన (జీఎంసీహెచ్)లో 16 మంది, ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో మరో 9 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 1900 పడకల జీఎంసీహెచ్ దవాఖానలో రోజూ సగటున 10 నుంచి 12 మంది రోగులు ప్రాణాలు కోల్పోతారని దవాఖాన డీన్ రాజ్ గాజ్భాయ్ తెలిపారు.
ప్రభుత్వ దవాఖానాల్లో మరణాలపై బాంబే హైకోర్టు స్పందించింది. నాందేడ్, ఔరంగాబాద్ దవాఖానల్లో రోగుల మరణాలపై సుమోటాగా కేసు నమోదుచేసి విచారణ చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యంపై బడ్జెట్ వివరాల్ని శుక్రవారం లోగా కోర్టుకు సమర్పించాలని ఏక్నాథ్ షిండే సర్కార్ను హైకోర్టు ఆదేశించింది.