కోల్కతా: పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు. శనివారం పోలింగ్ ముగిసిన తర్వాత.. మాల్దా జిల్లాలోని బైష్ణవ్నగర్లో ఓ టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. హత్యలు, ఘర్షణలపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నారు. హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి.