లక్నో, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధితుడి తల్లి ఆరోపిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో సత్యేంద్రను వదిలిపెట్టేందుకు పోలీసులు రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశారని, లేకుంటే మరో పెద్ద కేసులో ఇరికిస్తామంటూ బెదిరించారని బాధితుడి సోదరుడు అరవింద్కుమార్ ఆరోపిస్తున్నారు.
14 ఏటీఎం కార్డుల ఫోర్జరీ కేసులో విచారించేందుకు రాధానగర్ పోలీసులు సత్యేంద్రకుమార్ను గత శనివారం పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారని జిల్లా ఎస్పీ రాజేశ్కుమార్ సింగ్ తెలిపారు. శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడని, వెంటనే దవాఖానకు తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అయితే గురువారమే తన కుమారుడిని కారణం చెప్పకుండా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని బాధితుడి తల్లి అంటున్నారు.