Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్గా మారింది. అది శుక్రవారం అర్ధరాత్రికి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. దీంతోపాటు ఎన్డీఆర్ బృంధాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో పుదుచ్చేరి, కరైకల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
తుఫాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.