Parliament Session | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ 2010లో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదిస్తే, మహిళా సాధికారత దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. ఇదే అంశంపై పలు రాజకీయ పార్టీలకు ఆమె ఇటీవలే లేఖ కూడా రాశారు. మహిళలు చట్టసభల్లో రిజర్వేషన్లు పొందే రోజు మరెంతో దూరంలో లేదని ఉపరాష్ట్రపతి ధన్కర్ కూడా పేర్కొనడంతో ఈ బిల్లు అంశంపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
మహిళా రిజర్వేషన్ బిల్లును యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1996లో తొలిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ బిల్లును పలుమార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2010లో బిల్లును రాజ్యసభ ఆమోదించగా.. లోక్సభలో ఆమోదముద్ర పడలేదు. అయితే, గతంలో రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లునే ప్రవేశపెడతారా? లేదా.. మరిన్ని సవరణలతో కొత్త బిల్లును తీసుకొస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. కనీసం 14 రాష్ర్టాల అసెంబ్లీలు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.