చెన్నై: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడం, అదే వేరియంట్ బుధవారం గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడం, దాంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్ట్రాలను అప్రమత్తం చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఎంఏ సుబ్రమణియన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని సెక్రటేరియట్లో ఈ సమావేశం జరిగింది. కరోనా నియమ నిబంధనలు, మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి ప్రధాన కొవిడ్ నియమాలను తప్పనిసరి చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.