పట్నా : బిహార్లో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. గడిచిన 24 గంటల్లో 47 కొత్త కరోనా కేసులు నమోదైన అనంతరం ఆయన ఈ వాఖ్యలు చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మరో వైపు ఒమిక్రాన్ భయాందోళనల మధ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్క్ (జూ) సహా అన్ని పార్కులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఏడాదికి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఇప్పటి వరకు 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటి వరకు బిహార్లో కేసులు నమోదవలేదు.
ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. మంగళవారం రాష్ట్రంలో కొవిడ్ కేసులు వందకంటే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్త కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,481కు పెరిగింది. అదే సమయంలో బీహార్లో ఇప్పటివరకు 12,095 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.