హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నల్లబల్లలు, చాక్పీస్లతో ఇంతకాల సాగిన సర్కారు బడి చదువు ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్లో దుమ్మురేపుతున్నది. సర్కారు టీచర్లు ఇప్పుడు కెమెరాల ముందు నిలబడి యాక్షన్ అనగానే పాఠాలు చెప్పి, కట్ అనగానే ఆపేస్తున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రభుత్వ టీచర్లు స్వయంగా యూట్యూబ్ చానళ్లు సృష్టించి చక్కగా పాఠాలు చెప్తున్నారు.
29 జిల్లాల్లో 40 యూట్యూబ్ చానళ్లు ఏర్పాటుచేశారు. వీటితోపాటు 64,674 వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు. టెలి-టీచర్ గ్రూపులు, ఫోన్ ఇన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తిచేస్తున్నారు. విద్యార్థులు కావాల్సినప్పుడల్లా పాఠాలను వీక్షిస్తున్నారు. టీచర్లకు విద్యాశాఖ అవసరమైన అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తున్నది.
రోజూ లక్షలమంది వీక్షణం
ఈ యూట్యూబ్ చానళ్లను ఇప్పటివరకు లక్షలమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రోజుకు 1,89,138 మంది విద్యార్థులు యూట్యూబ్ చానల్ ద్వారా పాఠాలు నేర్చుకొంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో గూగుల్మీట్ ద్వారా బోధన కొనసాగుతుండగా, 850 వాట్సాప్ గ్రూపులు, టెలి-టీచర్ గ్రూపులను కూడా ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో డీఎడ్, బీఎడ్ విద్యార్థులకు కొన్ని గ్రామాలను దత్తత ఇచ్చి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు.
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్) ద్వారా పాఠ్యాంశాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. గతంలో 6 నుంచి10వ తరగతివరకు 1,070 పాఠ్యాంశాలను డిజిటలైజ్ చేయగా, 2020 సెప్టెంబర్ నుంచి తెలుగు, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో 1,126 పాఠ్యాంశాలను డిజిటలైజ్ చేశారు. 3 నుంచి 10వ తరగతివరకు 1,760 పాఠ్యాంశాలను రికార్డు చేసి ప్రసారం చేస్తున్నారు. వీటిని ఆయా యూట్యూబ్ చానళ్ల ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో టీచర్లు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలు తీరుస్తున్నారు.
ఇవీ కూడా చదవండి
‘ఆ మహిళ హాబీ రూ లక్షలు కురిపించింది’
శరీరానికి సరిపడా సీ విటమిన్ కావాలంటే.. వీటిని తినండి
అనిల్ అంబానీ ఆస్తిని. యెస్ బ్యాంక్ ఏం చేసిందంటే!