లక్నో, ఫిబ్రవరి 28: తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు. చనిపోయిన తన తాతయ్య మిశ్రీ లాల్ తన పేరున ఆస్తి రాశారని, అయితే తాత సోదరుడు కైలాశ్ ఆ ఆస్తిని ఆక్రమించుకొన్నారని శ్లోక్ కుమార్ తన అత్తతో కలిసి జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసును విచారించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ..వెంటనే ఆస్తిని బాలుడి పేర రిజిస్టర్ చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.50 వేలు బాలుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని, సీఎం బాల్ సేవా యోజన (కొవిడ్) ద్వారా నెలకు రూ.4 వేలు, పీఎం కేర్స్ ద్వారా రూ.10 లక్షలు బాలుడికి ఇవ్వాలని ఆదేశించారు. 18 ఏండ్లు వచ్చే వరకు అతడి ఆస్తికి జిల్లా పట్టణాభివృద్ధి ఏజెన్సీ ప్రాజెక్ట్ అధికారి సంరక్షకుడిగా ఉండాలని ఆదేశించారు.