న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాతోపాటు మరి కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. చైనాతోపాటు మరో ఐదు ఆసియా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా నెగటివ్ రిపోర్ట్ను తప్పనిసరి చేయనున్నది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. అలాగే కొత్త ఏడాదైన జనవరిలో దేశంలో కరోనా కేసులు మరింతగా పెరుగవచ్చని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో రానున్న 30-35 రోజులు మరింత కీలమని వెల్లడించాయి. అయితే కరోనా నాలుగో వేవ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, కరోనా మరణాలు చాలా తక్కువగా ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, గత రెండు రోజుల్లో విదేశాల నుంచి నుంచి భారత్కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో ఆరు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీ ఎయిర్పోర్ట్ను గురువారం సందర్శించనున్నారు. కరోనా టెస్టింగ్, ప్రయాణికుల స్క్రీనింగ్ విధానం, సంబంధిత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే కరోనా ఫోర్త్ వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఇప్పటికే పిలుపునిచ్చారు.