న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మూడు వారాలుగా కేసులు పెరుగుతున్నాయి.
ఢిల్లీ, హరియాణ, యూపీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే తొలుత అధిక కేసులు నమోదైనా ఆపై గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. గత వారం రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 6,300కు పైగా కేసులు నమోదయ్యాయి.
అంతకుముందు వారంతో పోలిస్తే ఇవి దాదాపు మూడు రెట్లు అధికం. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లతోనే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నమూనాల్లో బీఏ.2.12.1, ఎనిమిది ఒమిక్రాన్ అనుబంధ రకాలు వెలుగుచూశాయి. శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత ఈ వివరాలు వెల్లడయ్యాయి. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్యలో పెరుగుదల రేటు పెద్దగా లేకపోవడం ఊరట కలిగిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.