న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ ఇవ్వడం ఇవాళ ప్రారంభమైంది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాయి. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడిన దీర్థకాలిక వ్యాధిగ్రస్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులు. దేశంలో 5.75 కోట్ల మంది బూస్టర్ డోస్కు అర్హులైన వారున్నారు. అందులో 2.75 కోట్ల మంది 60 ఏండ్లకు పైబడిన కోమార్బిడిటీస్ ఉన్నవారే. అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్ 2 కోట్లమంది, హెల్త్కేర్ వర్కర్స్ కోటి మంది ఉన్నారు.
ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. బూస్టర్ డోస్కు అర్హులైనవారు నేరుగా సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లి టీకా వేయించుకోవచ్చని వెల్లడించింది. అయితే, కోమార్బిడిటీస్తో సంబంధం లేకుండా వృద్ధులందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నది. అయితే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.