ధరను తగ్గించినట్టు భారత్ బయోటెక్, సీరం ప్రకటన
18 ఏండ్లు నిండిన వారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ
ప్రైవేట్ కేంద్రాల్లో అందుబాటులోకి
కొత్తగా మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వేసుకున్న వ్యాక్సినే ప్రికాషన్ డోసుగా వేసేలా చూడాలని రాష్ర్టాలను ఆదేశించింది. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని కనీసం 9 నెలల దాటి ఉండాలని పేర్కొంది. ప్రికాషన్ డోసు పంపిణీ నేపథ్యంలో టీకా తయారీ సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్ ధరను రూ.600 నుంచి 225కి, కొవాగ్జిన్ ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాయి.
సర్వీస్ చార్జి రూ.150 అదనం
ప్రైవేటు వ్యాకినేషన్ కేంద్రాలు ఒక్కో వ్యాక్సిన్ డోసు ధరపై సర్వీస్ చార్జి కింద రూ.150 అదనంగా వసూలు చేయనున్నాయి. కొవిన్ వెబ్సైట్లో ఇప్పటికే లబ్ధిదారుల వివరాలు ఉండటంతో ప్రికాషన్ డోసు కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హెల్త్ కేర్వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.
గుజరాత్లో ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు
గుజరాత్లో తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన 67 ఏండ్ల వ్యక్తి గత నెలలో గుజరాత్లోని వడోదరకు వచ్చాడు. ఆయనకు ఈ వేరియంట్ సోకినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. మార్చి 12న ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గాంధీనగర్లోని ఓ ల్యాబ్లో అతడి నమూనాలను పరీక్షించగా ఎక్స్ఈ వేరియంట్ సోకినట్టు గుర్తించారు. కోల్కతాకు నమూనాలను పంపగా, తాజాగా ఎక్స్ ఈ వేరియంట్ అని నిర్ధారణ అయింది.
కరోనా ఇంకా ముగియలేదు..
దాదాపు నాలుగు నెలలకో కరోనా వేరియంట్ పుట్టుకొస్తున్నదని, ఈ మహమ్మారి ఇప్పట్లో ముగిసేలా లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ హెచ్చరించారు. ఆసియాలో కరోనా వ్యాప్తి చెందుతున్నదని, ప్రపంచవ్యాప్తంగా రోజుకు రూ.15 లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలో మరో కొత్త వేవ్ చుట్టముడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఫార్మారంగం కలసి పనిచేయాలని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక ఆదాయం ఉన్న కొన్ని దేశాలు రెండో బూస్టర్ డోస్ వేసేందుకు సిద్ధపడుతున్నాయని, ప్రపంచంలోని మూడో వంతు ప్రజలకు వ్యాక్సినే వేయలేదని చెప్పారు.