అగర్తలా: ఒక జంట మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై మహిళ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత విద్యుత్ స్తంభానికి కట్టేశారు (Couple Tied To Electric Pole). అనంతరం వారిద్దరినీ చితక్కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఈ సంఘటన జరిగింది.
ఒక వ్యక్తికి పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బంధువుల ఇంట్లో ఉంటున్న 20 ఏండ్ల యువతి, ఆ వ్యక్తి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం వారిద్దరూ కలిసి ఉండగా మహిళ బంధువులు ఆ జంటను పట్టుకున్నారు. అనంతరం వారిని విద్యుత్ పోల్కు తాళ్లతో కట్టేశారు. అంతా చూస్తుండగా వారిద్దరిని కొట్టారు. ఆ ప్రాంతంలోని స్థానికులు వారిని కాపాడేందుకు ముందుకు రాలేదు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసుల దృష్టికి ఇది వెళ్లింది. అయితే తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి లేదా మహిళ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.