బెంగళూరు: చికిత్స కోసం హాస్పిటల్కు వెళ్తున్న దంపతులను ట్రాఫిక్ పోలీసులు వేధించారు. చలానా కట్టకపోతే వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాలని వారు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ కొంత సేపటికి స్పృహ తప్పింది. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులను వేధించిన పోలీసులపై వారి కుమారుడు ఫిర్యాదు చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 2న మంగళ అనే మహిళ తన భర్తతో కలిసి కారులో హాస్పిటల్కు వెళ్లింది. ఆ దంపతులు మధుమేహం, బీపీతో బాధపడుతున్నారు.
కాగా, బెంగళూరులోని సంగమ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. పెండింగ్ ఉన్న రూ.5,000 చలాన్ను వెంటనే కట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ వద్ద ఉన్న రూ.2000 చెల్లిస్తామని, అర్జెంట్గా హాస్పిటల్కు వెళ్లాలని ఆ దంపతులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక భర్త ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి పెండింగ్ చలానా చెల్లించాడు. ఈలోపు ఆ కారులో వేచి ఉన్న మంగళ హైబీపీకి గురై స్పృహ తప్పింది.
మరోవైపు పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. దీని గురించి జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.