బెంగళూరు, ఆగస్టు 27: డబుల్ ఇంజిన్.. కాదుకాదు ట్రబుల్ ఇంజన్ వైఫల్యాల పరంపరలో ఇదొకటి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహ పరుస్తున్నదని తెలిపే విచిత్ర, విషాద ఉదంతం. కమీషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఆ రాష్ట్రంలో తాజాగా విద్యాసంస్థలు తమ సమస్యలపై ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి మొరపెట్టుకోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అంశం.
బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భారీ అవినీతిలో కూరుకుపోయిందని ఆ రాష్ట్ర పాఠశాలలు ప్రధానికి లేఖ రాశాయి. పాఠశాలలకు గుర్తింపు పత్రాలు జారీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని దాదాపు 13 వేల ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు, అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి బీసీ నగేశ్కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని తెలిపాయి. వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విన్నవించాయి. కర్ణాటక ప్రవైటు స్కూళ్ల కడగండ్లు కేవలం కమీషన్ల కే పరిమితం కాదు. విద్యాసంవత్సరం ప్రారంభమై చాలా రోజులైనా ప్రభుత్వం విడుదల చేసిన పాఠ్య పుస్తకాలు ఇంకా స్కూళ్లకు చేరలేదని లేఖలో వివరించాయి. అసలు విద్యాశాఖలో సంస్కరణల అమలు చేయాలన్న సోయి మంత్రి నగేశ్కు లేనేలేదని మండిపడ్డాయి. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరాయి. మంత్రిని తొలగించి, ఆయనపై దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశాయి. ఇంతకూ ప్రధాని మోదీ సర్కారు తనపార్టీ ప్రభుత్వానికి గడ్డిపెడతుందా? అనేది సందేహమే.
కాంట్రాక్టుల్లో 40% కమీషన్
కాంట్రాక్టుల్లో 40 శాతం నిధుల్ని కమీషన్గా ఇవ్వాలని అధికార బీజేపీ మంత్రులు, నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఇప్పటికే కాంట్రాక్టర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్టు స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్సీఏ) ప్రెసిడెంట్ డీ కెంపన్న మూడు రోజుల కిందటే వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు అని పేర్కొన్నారని, ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని మంత్రులే లంచాలకు మరిగారని వాపోయారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ కోలార్ జిల్లా ఇంచా ర్జ్, మంత్రి మునిరత్న అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని సీఎం బసవరాజ్ బొమ్మై సహా మంత్రులు అడుగుతున్నారని, న్యాయవిచారణ కమిటీ ముందే సాక్ష్యాలు బయటపెడుతామని అన్నారు.