బెంగళూరు, ఏప్రిల్ 14: కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని పేర్కొన్నారు. ప్రభు త్వ కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యేలు అడుగుతున్న లంచాలపై సీఎం బొమ్మైని నాలుగైదు సార్లు కలిసినా ఉలుకూ పలుకూ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని విమర్శించారు. ఎమ్మెల్యేల వేధింపులు భరించలేక వచ్చే నెల 25 నుంచి నెల రోజుల పాటు పనులన్నీ నిలిపేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.
ఎమ్మెల్యేల కమీషన్ల దాహంపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మే 25న బెంగళూరులో 50 వేల మంది కాంట్రాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహిస్తారని కెంపన్న చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పనులు ఆపివేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో అధికార బీజేపీ ఎమ్మెల్యేలు సివిల్ కాంట్రాక్టర్ల నుంచి 40% కమీషన్ అడుగుతున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. మంత్రి ఈశ్వరప్ప వేధింపులు భరించలేక ఇటీవల బీజేపీకే చెందిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకొన్నారు.
గతంలో మోదీకి లేఖ
ఐదారుగురు మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేల అవినీతి చిట్టా కాంట్రాక్టర్ల దగ్గర ఉందని, 15 రోజుల్లో సీఎం బొమ్మై చర్యలు తీసుకోకపోతే వాటిని బయటపెడతామని కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరించింది. స్వతంత్ర దర్యాప్తు జరిపితే సహకరించడానికి కాంట్రాక్టర్లంతా సిద్ధంగా ఉన్నట్టు కెంపన్న చెప్పారు. కానీ తమ ఆరోపణలను బొమ్మై ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో చాలా అవినీతి ఉందని కెంపన్న పేర్కొన్నారు. కాంట్రాక్టులో 5% అడ్వాన్స్గా ఇవ్వకపోతే ఆ మంత్రి కనీసం టెండర్లను కూడా ఆమోదించరని చెప్పారు. సీఎం కార్యాలయంలో కూడా అవినీతి పేరుకుపోయిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల అవినీతిపై అసోసియేషన్ గతేడాది జూలైలోనే ప్రధాని మోదీకి కూడా లేఖ రాసింది.
మంత్రి పదవికి ఈశ్వరప్ప రాజీనామా
కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సీఎం బొమ్మైకి రాజీనామా లేఖ సమర్పిస్తానని చెప్పారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు ఈశ్వరప్పే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో రాజీనామా చేయక తప్పలేదు. ఉడుపికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఇటీవల ఆత్మహత్య చేసుకొన్నారు. పేమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి మంత్రి ఈశ్వరప్ప 40% కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అంతకు ముందు ఆరోపించారు. దీంతో ఈశ్వరప్పపై కేసు నమోదైంది.