ముంబై : దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. మహమ్మారి ప్రభావం పాఠశాలలపైనా కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. తాజాగా ఈ జాబితాలో ముంబై, గోవా చేరాయి. ముంబైలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఒకటి నుంచి 9 తరగతి వరకు అన్ని పాఠశాలలను ఈ నెల 31 వరకు మూసివేసింది. పది నుంచి 12 తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగనున్నాయి. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాఠశాలలను మూసివేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గోవాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ నెల 26 వరకు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిందని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. సోమవారం కొవిడ్-19పై టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రమోద్ సావంత్ విలేకరులతో మాట్లాడుతూ గోవా ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తుందని ప్రకటించారు. గోవాలో ఆదివారం 10.7 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది.
రేపటి నుంచి జనవరి 26 వరకు పాఠశాలల్లో 8, 9 తరగతులకు ఫిజికల్ క్లాస్లు మూసివేయాలని నిర్ణయించినట్లు టాస్క్ఫోర్స్ సభ్యుడు శేఖర్ సల్కర్ పనాజీలో విలేకరులతో పేర్కొన్నారు. అదే సమయంలో 11, 12 తరగతి విద్యార్థులు కరోనా టీకా వేసుకునేందుకు పాఠశాలకు రావాలని, ఆ తర్వాత వారు పాఠశాలకు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. గోవాలో ప్రతి వారం కొవిడ్-19 పాజిటివిటీ ఐదు శాతం ఉన్నందున ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇండోర్ యాక్టివిటీస్పై ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తున్నది.