తిరువనంతపురం, మే 2: కేరళ ఎన్నికల చరిత్రను లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) తిరగరాసింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఒకే పార్టీ/కూటమి వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు. ఆ సంప్రదాయాన్ని ఈసారి ఎల్డీఎఫ్ తిరగరాస్తుందని, వరుసగా రెండోసారి విజయం సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడు అది నిజమైంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఎల్డీఎఫ్ కూటమి 99 చోట్ల విజయం సాధించింది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాలతో సరిపెట్టుకొన్నది. కేరళలో ఎలాగైనా సత్తా చాటాలనుకొన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ పాపులారిటీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. స్వయంగా శ్రీధరన్ ఓటమి పాలవ్వడమే కాకుండా బీజేపీ కేరళలో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా గెలువలేదు. గతంలో గెలిచిన నెమోమ్ స్థానంలో కూడా ఓడిపోయింది. ఎల్డీఎఫ్ చరిత్రాత్మక విజయానికి కారణం సీఎం విజయన్ అని చెప్పక తప్పదు. కేరళ ఎన్నికల ప్రచారంలో విజయన్ అన్నీ తానై వ్యవహరించారు. ప్రత్యర్థులపై ఆరోపణలకు బదులుగా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. వరదలు, నిఫా వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వం సమర్థతను గుర్తుచేశారు. బీజేపీ ఐటీ సెల్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు విజయన్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) సైబర్ ఆర్మీ పేరిట ఓ సామాజిక మాధ్యమ వేదికను నెలకొల్పింది. ప్రభుత్వ పథకాలను, విజయన్ కృషిని విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయన్ సర్కారుపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఏకంగా సీఎం కార్యాలయం హస్తం ఉందన్న ఆరోపణలు రాజకీయాలను కుదిపివేశాయి. కేంద్రదర్యాప్తు సంస్థలు రాష్ర్టానికి వరుసకట్టాయి. ఈ ఆరోపణలు విజయన్ వ్యక్తిత్వంపై మచ్చ అవుతాయని, ఎన్నికల్లో తమకు లాభిస్తాయని కాంగ్రెస్, బీజేపీ భావించాయి. అయితే ఈ పరిణామాన్ని విజయన్ తనకు అనుకూలంగా మార్చుకొన్నారు. కేంద్రప్రభుత్వం కక్షగట్టి తనపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని ప్రచారం నిర్వహించారు. మరోవైపు, శబరిమల వివాదం తమకు లాభిస్తుందనుకొన్న బీజేపీకి భంగపాటు ఎదురైంది.
కేరళలో మత రాజకీయాలకు చోటు లేదని తాజా ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయని సీఎం విజయన్ అన్నారు. ‘ఎల్డీఎఫ్ విజయం ప్రజలకు అంకితం’ అని పేర్కొన్నారు. ఎల్డీఎఫ్ సర్కారును అపఖ్యాతి పాలు చేయడానికి ఎన్డీఏ, యూడీఎఫ్ విష ప్రచారం చేశాయని, వాటి విషప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు.