Coronavirus | న్యూఢిల్లీ: దక్షిణాసియాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానలను ఆదేశించినట్లు వారు చెప్పారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ దవాఖానలో గత వారం కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన రోగులలో ఓ మైనర్తోసహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ రోగులకు దీర్ఘకాలిక రోగాలు కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
కేరళలో గతవారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, కేంద్ర ప్రభుత్వ దవాఖానలకు చెందిన నిపుణులతో సోమవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కొవిడ్-19 పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సమావేశం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయని, దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా తక్కువని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులలో చాలావరకు అన్నీ తేలికపాటి లక్షణాలతో ఉన్నవని, కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిని దవాఖానలో ఉంచి చికిత్స అందచేయవలసిన అవసరం లేదని వారు చెప్పారు.
సింగపూర్, చైనా, థాయ్లాండ్లో కొవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్లో నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్.1, దాని సబ్వేరియంట్లే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని సింగపూర్ తెలిపింది.