Corona | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, చైనాలో ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ఈ వేరియంట్ ప్రమాదకరమేమీ కాదని, మరణ ముప్పు తక్కువేనని పేర్కొంది. ఈ వేరియంట్ ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియా, కెనడా, చైనాలో కనిపిస్తున్నదని తెలిపింది. అమెరికాలో 17 శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని పేర్కొంది. కొవిడ్-19 డాటాను చాలా దేశాలు తమకు నివేదించడం లేదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ విచారం వ్యక్తం చేశారు. కొవిడ్ డాటాను రిపోర్ట్ చేయాలని, కేసులు, మరణాలు, టీకా తదితర డాటాను తప్పనిసరిగా రూపొందించాలని సూచించారు.
భారత్లో ఇదీ పరిస్థితి…
భారత్లో ఈజీ.5 వేరియంట్ మే నెలలో వెలుగు చూసినట్టు కేంద్రం తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్పై దృష్టి సారించినట్టు వెల్లడించింది. మరోవైపు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఓ సర్వే హెచ్చరించింది. ఈ రాష్ర్టాల్లో జ్వరం, కొవిడ్ లక్షణాలతో చాలామంది బాధపడుతున్నారని లోకల్ సర్కిల్స్ ఫౌండ్ వెల్లడించింది.
వెలుగులోకి కొవిడ్ దుష్పరిణామాలు…
మరోవైపు సుదీర్ఘ కొవిడ్ వల్ల సంభవించే దుష్పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్తో పోరాడి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి కాళ్లు నీలం రంగులోకి మారుతున్నట్టు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు తెలిపారు. ఆ వ్యక్తి 10 నిమిషాలు నిలబడితే అతని కాళ్లు క్రమంగా నీలం రంగులోకి మారుతున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. తిరిగి కూర్చోగానే సాధారణ స్థితిలోకి మారుతున్నాయని తెలిపారు. అక్రోక్యానోసిస్గా పిలుచుకునే ఈ అరుదైన వ్యాధి గురించి లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు.