స్పెషల్ టాస్క్ బ్యూరోనమస్తే తెలంగాణ);అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నది. గ్రామపంచాయతీలో ఓ దళితుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకుల ఠాకూర్లు అతడి తల పగలగొట్టారు. ఈ దాష్టీకంపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకూ మరోసారి దాడి చేశారు. ఛత్తర్పూర్ జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని చౌకాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకొన్నది.
గ్రామానికి చెందిన ఓ దళితుడు గ్రామపంచాయితీ కార్యాలయానికి వెళ్లి, ప్రభుత్వం అమలుచేస్తున్న కపిలధార పథకం కింద తనకు బావి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దీంతో ఆ గ్రామ పెత్తందారి రోహిత్ సింగ్ ఠాకూర్.. తీవ్ర ఆవేశానికిలోనై తన ఎదుటే కుర్చీలో కూర్చుంటావా? అని దాడి చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. తెల్లవారే అతడి ఇంటిపై దాడి చేశారు. బాధితుడి చేయి విరగొట్టి, చంపేస్తామని హెచ్చరించారు. దాడిపై పంచాయతీ కార్యదర్శి సాక్ష్యం చెప్పినా పోలీసులు కేసు నమోదు చేయకపోవటం గమనార్హం. ఘటనపై స్పందించిన నెటిజన్లు.. ఇదీ బీజేపీ డబుల్ ఇంజిన్ పాలన అని మండిపడుతున్నారు.
దళిత విద్యార్థి మృతిపై ఆగ్రహజ్వాల
ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో దళిత విద్యార్థి మృతదేహంతో కుటుంబసభ్యులు, భీమ్ ఆర్మీ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో పదో తరగతి బాలుడిని కులం పేరుతో దూషించి రాడ్లతో విచక్షణారహితంగా చావబాదిన అగ్రకుల ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని అఛల్దాలోని పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోభీమ్ ఆర్మీ సభ్యులు సమీపంలో ఉన్న పోలీస్ వాహనానికి నిప్పు అంటించారు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
నిందితుడిని తక్షణమే అరెస్టు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు బాలుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. ఈ నెల 7న సాంఘికశాస్త్రం పరీక్షలో స్పెల్లింగ్ తప్పుగా రాశాడని పదో తరగతి చదివే దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు అశ్వినీసింగ్ రాడ్లు, కర్రలతో చావబాదాడు. పాఠశాలలో స్పృహ కోల్పోయిన బాలుడిని అంబులెన్స్లో దవాఖాన తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు సోమవారం తుదిశ్వాస విడిచాడు. పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తమను న్యాయం చేయాలని, ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి కుటుంబసభ్యులు, భీమ్ ఆర్మీ సభ్యులు మృతదేహంతో పాఠశాల ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు.