Cooking Oil Prices | ముంబై, సెప్టెంబర్ 13: దేశంలో వంటనూనె ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో పామ్ ఆయిల్, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె ధరలు పెరగనున్నాయి. ముడి సోయా, సన్ఫ్లవర్, పామ్ నూనెలపై ఇప్పటివరకు కస్టమ్స్ డ్యూటీ ఉండేది కాదు. ఇప్పుడు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించింది.
గతంలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనెపై 12.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు వీటిపై 32.5 శాతం దిగుమతి సుంకం పడనుంది. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై సుంకం 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరగనుంది. ఇది సెప్టెంబర్ 14 నుంచి అమలులోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నూనెల ధరలు పెరగడంతో పాటు డిమాండ్ తగ్గనుంది. మరోవైపు, ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని కేంద్రం 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది.