న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లతో కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మద్యం విధానం కేసులో కేజ్రీవాల్ను త్వరలోనే అరెస్టు చేయబోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని వారిని బెదిరించిందన్నారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉంటూ, ఈ ఆఫర్ను తిరస్కరించారన్నారు. ఎక్స్లో కేజ్రీవాల్ శనివారం చేసిన సుదీర్ఘ పోస్ట్లో ఈ ఆరోపణలు చేశారు.
“ఇటీవల వారు (బీజేపీ) ఢిల్లీకి చెందిన మా ఏడుగురు ఎమ్మెల్యేలను సంప్రదించారు. కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎమ్మెల్యేల్లో చీలిక తెస్తాం. 21 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాం. మీరు కూడా రావచ్చు. మేం రూ.25 కోట్లు ఇస్తాం, బీజేపీ టిక్కెట్ మీద ఎన్నికల్లో పోటీ చేయండి” అని బీజేపీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పారని కేజ్రీవాల్ తెలిపారు.
ఆప్ను ఎన్నికల్లో ఓడించే సత్తా బీజేపీకి లేదని, అందువల్లే ఢిల్లీ రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నిస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. “దీని అర్థం ఏమిటంటే, నన్ను అరెస్టు చేయబోతున్నది ఏదో మద్యం పాలసీ కేసులో దర్యాప్తు కోసం కాదు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి. భగవంతుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతిచ్చారు. ఈసారి కూడా వాళ్లు తమ దురుద్దేశాలను అమలు చేయడంలో విఫలమవుతారు” అని చెప్పారు. ఢిల్లీ మంత్రి అతిశీ కూడా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ బీజేపీ నేత ఆప్ ఎమ్మెల్యేకు చేసిన ఫోన్ కాల్ రికార్డయిందన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలపై బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించడానికి ఉపయోగించిన ఫోన్ నంబర్ను కేజ్రీవాల్ కనీసం ఒకసారైనా బయటపెట్టలేదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరు సంప్రదించారో, ఎక్కడ సమావేశమయ్యారో కూడా చెప్పడం లేదన్నారు. కేవలం ప్రకటనలు ఇచ్చి, దాక్కుంటారన్నారు.