Sukesh Chandrashekhar : మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏఐఏడీఎంకేకు సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈ బెయిల్ మంజూరైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతడిపై 2017 నుంచి పలు కేసులు నమోదు చేసింది. ఆర్థిక మోసాలకు పాల్పడటం, డబ్బు అక్రమ రవాణా వంటి పలు కేసులు నమోదు చేసింది. వీటిలో తమిళనాడులోని ఏఐఏడీఎంకేకు ఆ పార్టీ గుర్తైన రెండు ఆకుల సింబల్ను అలాగే ఉంచేలా చేస్తానని నమ్మించాడు.
దీనిలో భాగంగా ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అతడిపై ఆరోపణలువచ్చాయి. ఇదే అంశంలో అతడిపై కేసు నమోదైంది. తాజాగా ఇదే అంశంపై అతడికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే స్పందిస్తూ సుకేష్ ఇప్పటికే ఈ కేసులో చాలా కాలం నుంచి జైలులో ఉన్నాడని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికి తమ కేసు విచారణ త్వరగా పూర్తై, న్యాయం జరిగే స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని సూచించారు. ఇక, పాస్పోర్ట్ పోలీసులకు అప్పగించడం, అతడు ఉండే స్థానిక అడ్రస్ గురించి పోలీసులకు చెప్పడం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వడం వంటివి తప్పనిసరి అని ఆదేశించారు.
ఈ కేసులో సుకేష్కు బెయిల్ వచ్చినప్పటికీ అతడు ఇంకా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే, అతడిపై నమోదైన మిగతా కేసులలో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. సుకేష్పై 31 కేసులు నమోదు కాగా, 27 కేసులలో బెయిల్ లభించింది. అతడు ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.