PM Modi : హింసతో అట్టుడికిన మణిపూర్ను కన్నెత్తి చూడకుండా పొరుగునే ఉన్న అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుంచి అలజడి రేగుతున్న మణిపూర్ను ప్రధాని మోదీ సందర్శించకపోవడం విస్మయం కలిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆక్షేపించారు.
గువహటి, ఇంఫాల్ మధ్య సోమవారం అందుబాటులో ఉన్న విమానాల వివరాలు, వాటి ధరలతో కూడిన స్క్రీన్ షాట్ను ఖేరా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మాకు సమాచారం ఇస్తే మేం విమాన టికెట్లు బుక్ చేస్తామని పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఇక విమాన టికెట్ల ధరలు రూ. 2500-రూ. 5000 ఉన్నట్టు స్క్రీన్షాట్ చూపింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా ప్రధాని అసోంలో పర్యటిస్తూ మణిపూర్ను విస్మరించడం పట్ల విమర్శలు గుప్పించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ శనివారం నాటి భేటీని ప్రస్తావిస్తూ మణిపూర్ మంటలు రేగి 9 నెలలైనా ప్రధానితో ఎలాంటి సమావేశం జరగలేదని, మోదీ మణిపూర్పై అసలు నోరు మెదపడం లేదని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రధాని గువహటిలో రోడ్షో నిర్వహించేందుకు వెళతారు కానీ ఇంఫాల్ వైపు కన్నెత్తి చూడరని, మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ తీరని అన్యాయం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ ఆదివారం అసోంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ మా నోటీసులను లెక్కచేయడం లేదు.. ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు