లక్నో : యూపీలో మదర్సాల సర్వేపై కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది. మతపరంగా ప్రజలను విభజించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలపై సర్వే చేపట్టిందని యూపీ కాంగ్రెస్ నేత సునీల్ రాజ్పుట్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్దేశం నిజాయితీతో కూడినదే అయితే మదర్సాల పరిస్థితిని మెరుగుపరిచేవారని వ్యాఖ్యానించారు. మదర్సాల్లో టీచర్లు, కరిక్యులం, మౌలిక వసతులపై సమాచారం రాబట్టేందుకు యూపీ ప్రభుత్వం గుర్తింపులేని మదర్సాలపై సర్వే నిర్వహించింది.
గుర్తింపు లేని పాఠశాలల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని తేలితే వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి గ్రాంట్స్ విడుదల చేయాలని, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించాలని కాంగ్రెస్ నేత రాజ్పుట్ డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో మదర్సాల సర్వే పూర్తయిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని యూపీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డానిష్ అన్సారీ తెలిపారు.
గుర్తింపు లేని మదర్సాలను గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పధకాలతో అనుసంధానించడమే సర్వే ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రక్రియకు మత పెద్దలు, మౌలానాలు సహకరించారని తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా మదర్సాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. మదర్సాలపై సర్వే నివేదికపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు (ఏఐఎస్పీఎల్బీ) సభ్యుడు మౌలానా యసూబ్ అబ్బాస్ ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వే నివేదికను నిష్పాక్షికంగా రూపొందించాలని, ఈ నివేదిక ఆధారంగా ఏకపక్షంగా చర్యలు చేపట్టరాదని అన్నారు.