న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాగు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలి నుంచీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న కిసాన్ మహాపంచాయత్ ప్రతిపాదించిన భారత్ బంద్ విజయవంతమయ్యేందుకు బీజేపీయేతర పక్షాలన్నీ ప్రయత్నించాలని కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన పోరాట కమిటీ నేత దిగ్విజయ్ సింగ్ కోరారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొద్దిమంది రైతులే ఆందోళన చేపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని రైతులంతా సమైక్యంగా తమ గళం పార్లమెంట్కు వినిపించాలని యూపీలోని ముజఫర్నగర్లో ఆదివారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ పిలుపు ఇచ్చింది. ఈ భేటీలో 15 రాష్ట్రాలకు చెందిన 300కుపైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమానికి అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాలు, వర్గాలు మద్దతు పలుకుతున్నాయని కిసాన్ మహాపంచాయత్ నిరూపించిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. సాగు చట్టాల రద్దు కోరుతూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని అవసరమైతే 2024 లోక్సభ ఎన్నికల వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని ఎస్కేఎం స్పష్టం చేసింది.