Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంలో చీలిక ఏర్పడుతుందంటూ మండిపడ్డారు. పరోక్షంగా బీజేపీపై సోనియా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారని.. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఐక్యత వైపు నడిపించే మార్గాలన్నీ నాశనమవుతున్నాయని, దాంతో సమాజంలో చీలిక పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం, లౌకికవాదాం ఒకదాంటో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. సెక్యులరిజాన్ని అనేక రకాలుగా అన్వయించారన్న సోనియా భారత్కు మాత్రం మహాత్మా గాంధీ చెప్పినట్టే.. ‘సర్వ ధర్మ సమ భవ’ అని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అన్ని మతాల ఐక్యతను అర్థం చేసుకొని లౌకిక దేశాన్ని స్థాపించేందుకు ప్రయత్నించారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం ఈ ఆలోచనను ప్రభుత్వానికి అన్వయించి.. తద్వారా లౌకిక ప్రజాస్వామ్యాన్ని సృష్టించారన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మెజారిటీతో ఏర్పడుతుందని.. ప్రభుత్వం మత సిద్ధాంతాలను పరిరక్షిస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను పరిరక్షిస్తుందని.. మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుందన్నారు. సమాజంలోని భిన్నవర్గాల మధ్య సామరస్యం, శ్రేయస్సును నెలకొల్పడమే భారత లౌకిక ప్రజాస్వామ్య మార్గదర్శక సూత్రమని.. సమాజంలో భిన్నవిశ్వాసాలతో పాటు భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతాలు, చరిత్రవంటి విషయాల్లోనూ వైవిధ్యం కనిపిస్తుందన్నారు. అయినప్పటికీ ఐక్యభావన మాత్రం ఉంటుందని.. కానీ మన ఉన్నత రాజ్యాంగం ఇప్పుడు దాడికి గురవుతోందన్నారు.
ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఓట్లు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని.. కానీ మెజారిటీ ప్రజలు ఒప్పుకుంటే వారికి మిగిలినవారిపై ఆధిపత్యం ఉంటుందా? అల్ప సంఖ్యలో ఉన్నవారి ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. తాత్కాలిక మెజారిటీ ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్లో విపరీత పరిణామాలకు దారి తీస్తే పరిష్కారం ఏంటి? మెజారిటీ సంఖ్యలో లేకపోవడం వల్లే తమ భాష, మతం, జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందడం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రస్తుతం మన సవాళ్లకు మనమే పరిష్కారాన్ని కనుగొని.. మన దేశాన్ని గౌరవించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సోనియాగాంధీ అన్నారు.