న్యూఢిల్లీ : అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. జైశంకర్కు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తే దేశం వెలుపల జాతీయ రాజకీయాలను మాట్లాడే విధానాన్ని ప్రారంభించారని పరోక్షంగా నరేంద్ర మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించింది.
రాహుల్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భారత్ను విమర్శించడం సరైంది కాదని, దేశ రాజకీయాలను దేశం వెలుపల ప్రస్తావించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధమని కేంద్ర మంత్రి జైశంకర్ ఆరోపించారు. విదేశీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తోసిపుచ్చారు. మీకు (జైశంకర్) మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తే ఈ విధానానికి ముందుగా శ్రీకారం చుట్టారని, ఈ విషయం మీకు తెలిసినా దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో ఆయా అంశాలు రాజకీయాల కన్నా పెద్దవిగా ఉంటాయని, దేశాన్ని దాటి వెళ్లినప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని రాసుకొచ్చారు. కాగా, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ దేశాన్ని విమర్శించడం అలవాటుగా మారిందని, రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తుంటారని జైశంకర్ విమర్శించారు. జాతీయ రాజకీయాలను విదేశీ వేదికలపైకి తీసుకెళ్లడం గాంధీ కుటుంబ విశ్వసనీయతను పెంచదని వ్యాఖ్యానించారు.
Read More
Rajasthan CM | అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈడీని ఉసిగొల్పుతున్న కేంద్రం : అశోక్ గెహ్లాట్