న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్ను భారత్ సమర్ధంగా ఎదుర్కొందని ప్రపంచానికి చాటేందుకు వంద కోట్ల టీకా డోసుల పంపిణీ విస్పష్ట సంకేతమన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
ప్రధాని ప్రసంగం సర్కార్ వైఫల్యంతో కరోనా మహమ్మారి బారినపడి తాము ప్రేమించే వారిని కోల్పోయిన ఎందరినో అవమానించేలా ఉందని కరోనా సెకండ్ వేవ్ను ఉద్దేశించి ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ గురించి గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ భారత్లో వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన నిలదీశారు.