న్యూఢిల్లీ : విపక్ష కూటమి కొత్త పేరును ఇండియాగా (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) ఖరారు చేయడంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఆక్షేపించారు. మన దేశానికి బ్రిటిషర్లు ఇండియాగా నామకరణం చేశారని, అలాంటి పేరును విపక్షం తమ కూటమికి ఎంచుకుందని శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా సహా పలు కార్యక్రమాలను ఇదే పేరుతో చేపట్టారని గుర్తు చేస్తూ వెళ్లి మీ బాస్కు చెప్పుకో అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ శర్మకు హితవు పలికారు.
కాగా బ్రిటిష్ వలసవాద ధోరణి నుంచి మనం బయటపడాలి. మన తాతలు భారత్ కోసం పోరాడారు..వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మనం భారత్ కోసం పాటు పడాలని విపక్ష కూటమి తమ అలయన్స్కు ఇండియా పేరును ప్రకటించిన వెంటనే హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు.
శర్మ ఇండియా పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే ఆయన బాస్ ప్రధాని మోదీ మాత్రం పలు రాష్ట్రాల సీఎంలను టీం ఇండియాగా అందరూ శ్రమించాలని చెబుతారని, మోదీ వోట్ ఇండియా అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని గుర్తుచేశారు. కానీ 26 రాజకీయ పార్టీలు ఇండియా పేరుతో కూటమి కడితే ఇండియా వలసవాద మనస్తత్వం వెల్లడిస్తుందని శర్మ అంటున్నారని..ఈ విషయమేదో ఆయన తన బాస్కు చెప్పుకోవాలని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఇండియా కోసం ఓటు వేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన పాత వీడియోను కూడా రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read More :